భాగ్పట్, డిసెంబర్ 31: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. లైంగిక వేధింపులను ప్రతిఘటించినందుకు ముగ్గురు దుర్మాగులు ఓ దళిత యువతిని బెల్లం తయారీ యూనిట్లో ఉపయోగించే పొయ్యిపై కాగుతున్న పెద్ద కడాయిలో పడేశారు. తీవ్ర కాలిన గాయాలపాలైన 18 ఏండ్ల యువతి ప్రస్తుతం ఢిల్లీలోని దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ ఘటన బధౌన్ జిల్లాలో జరిగింది. యజమానితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పోలీసులు ఆదివారం వెల్లడించారు. బాధితురాలు ముజఫర్నగర్ వాసి. ఆమె ప్రమోద్ అనే వ్యక్తికి చెందిన బెల్లం తయారీ యూనిట్లో పనిచేస్తున్నదని బినౌలి పోలీసుస్టేషన్ ఇన్స్పెక్టర్ ఎంపీ సింగ్ పేర్కొన్నారు. మూడు రోజుల క్రితం యువతి కడాయి వద్ద పనిచేసుకొంటుండగా.. ప్రమోద్, రాజు, సందీప్ ఆమెపై వేధింపులకు పాల్పడ్డారని, అసభ్యకరంగా ప్రవర్తించారని బాధితురాలి సోదరుడు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వేధింపులను ప్రతిఘటించడంతో నిందితులు ఆమెను హత్య చేసే ఉద్దేశంతో కాగుతున్న కడాయిలో విసిరేశారని, కులం పేరుతో దూషించారని చెప్పారు.