Atishi : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ అరెస్ట్పై ఆ పార్టీకి చెందిన కీలక నాయకురాలు, ఢిల్లీ మంత్రి అతిషి మరోసారి తీవ్రంగా స్పందించారు. బీజేపీ సర్కారు కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించి కేజ్రీవాల్ను అరెస్ట్ చేయించిందని, సరైన ఆధారాలు లేకున్నా ఆయనను జైల్లో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలు ఒక్క కేజ్రీవాల్ను జైల్లో పెడితే.. వేల మంది కేజ్రీవాల్లు పుట్టుకొస్తారని వ్యాఖ్యానించారు.
‘మీరు అర్వింద్ కేజ్రీవాల్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఆయన కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు. ఆయన ఒక ఆలోచన. మీరు ఒక్క అర్వింద్ కేజ్రీవాల్ను జైల్లో పెడితే.. ఆయన నుంచి ప్రేరణ పొంది దేశంలో వేల మంది అర్వింద్ కేజ్రీవాల్లు పుట్టుకొస్తారు’ అని బీజేపీ సర్కారు తీరుపై అతిషి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆప్ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఆమె మీడియాతో మాట్లాడారు.