లక్నో: ఉత్తరప్రదేశ్ జైలులో మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకింది. (HIV positive prisoners) హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య 47కు పెరిగింది. దీంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిడ్స్ సోకిన రోగులకు చికిత్సతోపాటు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. యూపీలోని లక్నో జిల్లా జైలులో ఈ సంఘటన జరిగింది. 2023 డిసెంబర్లో లక్నో జైలులోని ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. తొలుత 11 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
కాగా, ఉత్తరప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అప్రమత్తమైంది. జైలులోని ఖైదీలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో తాజాగా మరో 36 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. లక్నో జిల్లా జైలులో హెచ్ఐవీ బారిన పడిన ఖైదీల సంఖ్య 47కు చేరింది.
మరోవైపు జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిడ్స్ సోకిన ఖైదీలను ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అలాగే వారికి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. బలమైన ఆహారం అందించేందుకు మెనూలో మార్పులు చేశారు. ఎయిడ్స్ కేసులు పెరుగుతుండటంతో జైలులో నిఘాను మరింతగా పెంచారు.