Maharashtra : మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు నక్సలైట్లు మృతిచెందారు. మరోవైపు మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒక జవానుకు గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్ను చికిత్స కోసం నాగ్పూర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని కోప్రి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది.
కోప్రి అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ కమాండో టీమ్ కూంబింగ్ జరుపుతుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. దాంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. గడ్చిరోలిలో నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తున్నారు. ఇటీవల నక్సలైట్ దంపతులు రూ.8 లక్షల రివార్డు తీసుకుని పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ దంపతులను అసిన్ రాజారామ్ కుమార్ (37) అలియాస్ అనిల్, అతని భార్య అంజు సుళ్య జాలే (28) అలియాస్ సోనియాగా గుర్తించారు.
రాజారామ్ కుమార్ ఒడిశాలోని మావోయిస్టుల ప్రెస్ టీమ్లో ఏరియా కమిటీ సభ్యుడు అని పోలీసులు తెలిపారు. అతను హర్యానాలోని నర్వానా గ్రామానికి చెందినవాడు. హిమాచల్ప్రదేశ్ రాజధాని సిమ్లా సమీపంలోని ఓ ప్రాంతంలో నకిలీ గుర్తింపుతో నివసిస్తున్నాడు.