Congress Politics | ఒక ఫ్యామిలీ- ఒక టికెట్ నిబంధనపైనే కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో బుధవారం నుంచి మూడు రోజులు సాగే చింతన్ శివిర్లోనూ దీనిపైనే ప్రధానంగా చర్చిస్తారని సమాచారం. చింతన్ శిబిర్ నేపథ్యంలో సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో చర్చ జరిగిన అంశాల్లో ఇదొకటని వినికిడి. అయితే, గాంధీ కుటుంబానికి మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో పరాజయాల పరంపర నుంచి విజయాల దిశగా పార్టీని మళ్లించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ చింతన్ శివిర్లో చర్చిస్తారని భావిస్తున్నారు.
సమిష్టి విధాన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా పార్టీ పార్లమెంటరీ బోర్డు పునరుద్ధరించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు చెప్పారు. ద్వేషపూరిత రాజకీయాలకు వ్యతిరేకంగా 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై పోరుకు అన్ని విపక్షాలతో పొత్తుకు చింతన్ శివిర్ పిలుపు ఇవ్వనుందని తెలుస్తున్నది.
పెరిగిపోతున్న జీవన వ్యయ సంక్షోభం, నిరుద్యోగంపై దృష్టి పెట్టడంతోపాటుఇటీవలి ఎన్నికల్లో మాదిరిగా విభజనపూరిత, మతతత్వ ప్రచారోద్యమాన్ని అనుమతించొద్దని పార్టీ వర్గాలు చెబతున్నాయి. ఎన్నికల ప్రచారం, సమన్వయం కోసం విడిగా ఎలక్షన్ వింగ్ ఏర్పాటు చేయాలని, దానికి ప్రధాన కార్యదర్శి స్థాయి నాయకుడ్ని నియమించాలన్న సూచన వచ్చింది. 50 ఏండ్ల లోపు వయస్సు గల నేతలకు పార్టీ పదవుల్లో సగం అప్పగించే అంశాన్ని చర్చించనున్నారు.