ముంబై: శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్ ఠాక్రే వర్ధంతి సందర్భంగా రెండుగా చీలిన ఆ పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. (Shiv Sena factions clash) నవంబర్ 17 బాలాసాహెబ్ వర్థంతి. అయితే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఒక రోజు ముందుగానే ముంబై శివాజీ పార్క్లోని బాలాసాహెబ్ ఠాక్రే స్మారకాన్ని సందర్శించారు. గురువారం సాయంత్రం అక్కడకు వెళ్లి నివాళి అర్పించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతలు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ‘ద్రోహులు వెళ్లిపోవాలి’ అంటూ నినాదాలు చేశారు. నేపథ్యంలో ఎదురెదురుగా తారసపడిన శివసేన రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
మరోవైపు సీఎం షిండే ఈ సంఘటనను ఖండించారు. ఇది దురదృష్టకరమని, ఇలాంటి వాటిని సహించబోమని అన్నారు. బాలాసాహెబ్ ఠాక్రేకు నివాళి అర్పించే హక్కు సీఎంగా తనకు ఉందని తెలిపారు. ఎలాంటి ఘర్షణలు జరుగకుండా ఉండేందుకు సాహెబ్ ఠాక్రే వర్ధంతి రోజుకు ముందే స్మారకాన్ని సందర్శించి నివాళి అర్పించినట్లు చెప్పారు.