న్యూఢిల్లీ: ప్రతి రోజూ 700 టన్నుల ఆక్సిజన్ ఇవ్వండి.. అప్పుడు ఆక్సిజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నా అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. ఒకవేళ కేంద్రం మాకు సరిపడా ఆక్సిజన్ ఇస్తే ఢిల్లీలో 9 వేల నుంచి 9500 బెడ్స్ ఏర్పాటు చేస్తాం. ఆక్సిజన్ బెడ్స్ను ఏర్పాటు చేసే వీలు మాకు కలుగుతుంది. అప్పుడు ఒక్కరు కూడా ఆక్సిజన్ కొరతతో చనిపోకుండా చూసుకుంటాం అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి 730 టన్నుల ఆక్సిజన్ను ఢిల్లీకి ఇచ్చినందుకు ఆయన కేంద్రంతోపాటు కోర్టులకు కృతజ్ఞతలు చెప్పారు.
ఢిల్లీలో ఆక్సిజన్ కొరత కారణంగా ఇప్పటికే ఎంతో మంది చనిపోయారు. చివరికి శవాలను దహనం చేయడానికి కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనిపై హైకోర్టు సీరియస్ అయింది. ఆక్సిజన్ ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణగా చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. దీంతో కేంద్రం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే ఢిల్లీకి సరిపడా ఆక్సిజన్ ఇవ్వాల్సిందే అని సుప్రీం కూడా స్పష్టం చేసింది. ఇప్పుడు ప్రతి రోజూ 700 టన్నుల వరకూ ఆక్సిజన్ అందే అవకాశాలు కనిపిస్తుండటంతో ఢిల్లీలోని హాస్పిటల్స్ అన్నింటినీ తమ బెడ్స్ సామర్థ్యాన్ని పెంచాల్సిందిగా కేజ్రీవాల్ సూచించారు.