న్యూఢిల్లీ, జూలై 7: మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించింది. సిసోడియా బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.11.49 లక్షలు, నిందితులు రాజేశ్ జోషి, గౌతమ్ మల్హోత్రాకు చెందిన ఆస్తులు అటాచ్ చేసిన వాటిలో ఉన్నాయన్నారు.
మద్యం పాలసీ కేసులో ఈడీ ఆస్తులు అటాచ్ చేయడం ఇది రెండోసారి. గతంలో ఆప్ నాయకుడు విజయ్ నాయర్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇటీవలే ఢిల్లీ హైకోర్టు ఈ కేసు తీవ్రత దృష్ట్యా సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. ఈ కేసును సీబీఐ, ఈడీ రెండూ దర్యాప్తు చేస్తున్నాయి.