న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది.
గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో 301 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. మొత్తం 11,56,464 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇక్కడ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్లో రెండో విడుతలో 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగుతున్నది. ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఎన్నికలు జరిగే స్థానాల్లో ముస్లిం జనాభానే అధికంగా ఉన్నది. దీంతో వారి నిర్ణయంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటారు.
2017లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 38 స్థానాలు గెలుచుకుంది. సమాజ్వాదీ పార్టీ 15, కాంగ్రెస్ రెండు స్థానాల చొప్పున గెలుపొందాయి. ఇక్కడ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
ఇక ఉత్తరాఖండ్లో 13 జిల్లాల్లోని 70 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 632 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 152 మంది స్వతంత్రులు ఉన్నారు. రాష్ట్రంలోని 82,38,187 మంది ఓటర్లు వీరి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరుగనుంది.