గువాహటి: వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (CAA) అమలుకు వ్యతికేరంగా రాష్ట్రవ్యాప్త బంద్కు అసోంలోని (Assam) ప్రతిపక్ష కూటమి పిలుపునిచ్చింది. రాష్ట్రంలో సీఏఏను అమలుచేయడానికి ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని 16 పార్టీల అస్సాం యునైటెడ్ అపోసిషన్ ఫోరమ్ (UOFA) స్పష్టంచేసింది. దీనివల్ల అస్పామీస్ కమ్యూనిటీ విచ్చిన్నమయ్యే అవకాశం ఉందని తెలిపింది. తమ భాషను, సాహిత్యం, సంస్కృతి, గుర్తింపును కోల్పోతమని వెల్లడించింది.
కాగా, ప్రతిపక్షాల బంద్ పిలుపుపై రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇలాంటి నిరసనలను గువాహటి హైకోర్టు గతేడాది మార్చిలో ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకమని, హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినట్లేనని చెప్పారు. బంద్లు చట్టవ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని స్పష్టం చేశారు. బంద్ చేసినట్లయితే ఆయా పార్టీల రిజిస్ట్రేషన్లు రద్దవుతాయని తేల్చిచెప్పారు. బంద్ సందర్భంగా జరిగే ఆర్థిక నష్టాన్ని నిరసనకారులు, వాటిని నిర్వహించే బాధ్యుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ సీఏఏ అమలుపై తాము వెనక్కి తగ్గేదిలేదని విపక్షాల కూటమి స్పష్టం చేసింది.
లోక్సభ ఎన్నికలకు ముందు ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రజలను విడగొట్టడమే బీజేపీ పన్నాగమని, తద్వారా బెంగాల్, అస్సామ్, త్రిపురలో ఓట్లు పొందొచ్చని ఆ పార్టీ భావిస్తున్నదని సీఏఏ వ్యతిరేక ఉద్యమకారుడు, ఎమ్మెల్యే అఖిల్ గొగోయ్ విమర్శించారు. కాగా, విపక్షాల బంద్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు.
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొన్నది. నాలుగేండ్ల కిందట ఆమోదం పొందిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం-2019 (సీఏఏ)ను తాజాగా అమల్లోకి తీసుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు భారత పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, దీని కోసం వెబ్ పోర్టల్ను కూడా సిద్ధం చేసినట్టు హోంమంత్రిత్వ శాఖకు చెందిన ప్రతినిధి ఒకరు తెలిపారు. విపక్షాల తీవ్ర నిరసనల మధ్య 2019 డిసెంబర్ 11న సీఏఏ బిల్లు-2019 పార్లమెంటు ఆమోదం పొందింది.
మతపరమైన హింస కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి భారత్కు వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు, క్రిస్టియన్ మతస్తులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు సీఏఏను తీసుకొచ్చారు. శరణార్థుల దగ్గర సరైన ధ్రువపత్రాలు లేనప్పటికీ పౌరసత్వాన్ని ఇస్తారు. 2014, డిసెంబర్ 31 కంటే ముందు వచ్చిన వారు మాత్రమే పౌరసత్వానికి అర్హులు.
1955 పౌరసత్వ చట్టాన్ని సవరిస్తూ తీసుకొచ్చిన కొత్త చట్టంలో ముస్లింలను మినహాయించడం వివాదానికి దారితీసింది. ఈశాన్య రాష్ర్టాల్లో పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ముస్లిం ఆధిపత్య దేశాల్లో మత హింస కారణంగా దేశంలోకి వలస వచ్చిన ముస్లిమేతరులకు ఈ పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. అయితే ఈ చట్టం ముస్లింల పట్ల వివక్ష చూపుతున్నదని, రాజ్యాంగ లౌకిక సూత్రాలకు తూట్లు పొడుస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి.