న్యూఢిల్లీ : అసోం సీఎం హిమంత బిశ్వ శర్మకు ప్రదానం చేసిన ఫెలోషిప్ను ఉపసంహరించాలని సింగపూర్కు చెందిన లీ కువన్ యూ స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీని అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ కుమార్ బోరా కోరారు. సింగపూర్ పితామహుడు లీ కువన్ యూ నిజాయితీతో కష్టపడి పనిచేయడం, విలువలకు కట్టుబడి ఉన్న రాజనీతిజ్ఞుడని, కానీ హిమంత బిశ్వ శర్మ భారత రాజకీయాల్లో దురాగతాలన్నింటికీ నిలువెత్తు నిదర్శనమని ట్విట్టర్లో పోస్ట్ చేసిన బహిరంగ లేఖలో బోరా పేర్కొన్నారు.
లీ కువన్ యూ ఎక్స్ఛేంజ్ ఫెలోషిప్ను శర్మకు ప్రదానం చేయడంతో తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని లేఖలో ఆయన ప్రస్తావించారు. శర్మ పలు ఆర్ధిక కుంభకోణాల్లో నిందితుడని, మైనారిటీలకు వ్యతిరేకంగా ఖండించదగిన ప్రకటనలు చేశారని పేర్కొన్నారు. బోరా లేఖపై బీజేపీ ప్రతినిధి రూపం గోస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ గౌరవం దక్కినందుకు బోరా గర్వపడాలని గోస్వామి హితవు పలికారు.
ఇలాంటి గౌరవం లభించిన అసోం తొలి ముఖ్యమంత్రి హిమంత శర్మేనని పేర్కొన్నారు. దేశాభివృద్ధి, సింగపూర్తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కృషిచేసిన వ్యక్తులకు ఈ ఫెలోషిప్ అందిస్తారని గుర్తుచేశారు. కాగా, గతంలో కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ప్లానింగ్ కమిషన్ మాజీ ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియాలకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేశారు.
Read More :
Sonia Gandhi | మహిళా రిజర్వేషన్ బిల్లుపై సోనియా గాంధీ ఏమన్నారంటే..!