Taj Mahal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ‘తాజ్మహల్ను కూల్చి.. అక్కడ దేవాలయాలు కట్టాలి’ అని అస్సాం బీజేపీ ఎమ్మెల్యే రుప్జ్యోతి కుర్మీ ప్రధాని మోదీని కోరారు. మొఘల్ చక్రవర్తుల కాలంలో కట్టిన కుతుబ్మినార్, తాజ్మహల్ కట్టడాల్ని కూల్చాలని డిమాండ్ చేశారు. భార్య ముంతాజ్ను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిజంగానే ప్రేమించాడా? అదే నిజమైతే ముంతాజ్ చనిపోయాక షాజహాన్ మరో మూడు పెండ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడు? అన్నదానిపై విచారణ జరపాలని సదరు ఎమ్మెల్యే ప్రధాని మోదీని కోరటం గమనార్హం.
రుప్జ్యోతి కుర్మీ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐతో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమంలో వైరల్గా మారింది. తాజ్మహల్, కుతుబ్మీనార్ కట్టడాల్ని కూల్చి, వాటి స్థానంలో దేవాలయాలు కట్టాలని ఆ వీడియోలో ప్రధానిని కుర్మీ కోరారు. దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యేగా తన ఏడాది జీతభత్యాల్ని విరాళంగా ఇస్తానని చెప్పాడు. “హిందూ రాజులు ఇచ్చిన నిధులతో తాజ్మహల్ను కట్టారు. మన డబ్బుతో కట్టిన కట్టడం అది. షాజహాన్ ఏడు పెండ్లిళ్లు చేసుకున్నాడు. ముంతాజ్ నాలుగో భార్య. ముంతాజ్ను అత్యంత ప్రాణపదంగా ప్రేమిస్తే, ఆమె మరణం తర్వాత మళ్లీ ఎందుకు పెండ్లిళ్లు చేసుకున్నాడు. ఈ కట్టడం ప్రేమకు చిహ్నం కాదు’ అంటూ కుర్మీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.