అసోం బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే చేసిన పనిని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఛీత్కరించుకుంటున్నారు. ఇదేం పని అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. అసోంలో విపరీతమైన వరదలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీకి చెందిన సిబు మిశ్రా అనే ఎమ్మెల్యే ఆయా గ్రామాల్లో పర్యటించడానికి సిద్ధపడ్డారు. ఓ చోట విపరీతమైన నీరు ఉండటం ద్వారా ఆయనకు దాటడం సాధ్యపడలేదు.
దీంతో అక్కడే ఉన్న రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, ఎమ్మెల్యే పడవ వరకూ వెళ్లారు. ఇప్పుడు ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఈ ప్రాంతంలో పెద్ద నీళ్లేమీ లేవు. కనీసం మోకాల్లోతు అంత నీరు కూడా లేదు. అయినా సరే.. రెస్క్యూ టీమ్ సభ్యుడి వీపుపై ఎక్కి, పడవ వరకూ వెళ్లడం ఏంటని నెటిజన్స్ మండిపడుతున్నారు.
#WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt
— ANI (@ANI) May 19, 2022
అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదలు కొనసాగుతుండటంతో 26 జిల్లాలోని 1089 గ్రామాలు నీట మునిగాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. కొండచరియలు విరిగి పడుతుండటంతో పలు ఇండ్లు నేలమట్టం అయ్యాయి. చచార్, నాగౌన్ జిల్లాల్లో వరద ఉధృతి అధికంగా ఉంది. భారీ వరదల కారణంగా నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఇక పలు గ్రామాల్లో చిక్కుకున్న 3 వేల మందిని పునరావాసలకు తరలించేందుకు ఆర్మీ, పారా మిలటరీ ఫోర్సెస్, విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. నిరాశ్రయుల కోసం 142 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పునరావాసాల్లో 39,558 మంది ఆశ్రయం పొందుతున్నారు. కొపిలి, దిసాంగ్, బరాక్ నదులు డేంజర్ లెవల్లో ప్రవహిస్తున్నాయి.