లక్నో: ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యక్తిని చూసేందుకు వచ్చిన బీజేపీ మేయర్ (Lucknow mayor) షూతో లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. డాక్టర్లు అభ్యంతరం తెలుపడంతో ఆ హాస్పిటల్ వద్దకు బుల్డోజర్ను రప్పించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో ఈ సంఘటన జరిగింది. లక్నోకు చెందిన మాజీ సైనికుడు సురేన్ కుమార్, థానా బిజ్నౌర్ ప్రాంతంలోని వినాయక్ మెడికేర్ ప్రైవేట్ హాస్పిటల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. నగర మేయర్ సుష్మా ఖారక్వాల్ సోమవారం ఆయనను పరామర్శించేందుకు ఆ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా కాళ్లకు వేసుకున్న బూట్లతోనే ఐసీయూ వార్డులోకి వెళ్లబోయారు. అయితే షూ విప్పి లోనికి వెళ్లాలని డాక్టర్లు చెప్పారు. బీజేపీ మేయర్ సుష్మా, ఆమె అనుచరులు దీనిపై ఆగ్రహం చెందారు. ఈ నేపథ్యంలో ఆ హాస్పిటల్ బయట పోస్టర్లు వెలిశాయి. అలాగే బుల్డోజర్ను అక్కడకు రప్పించారు. దీంతో ఆ హాస్పిటల్ వద్ద గందరగోళం చెలరేగింది.
కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఆ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. అయితే షూతో ఐసీయూలోకి వెళ్లనీయనందుకు మేయర్ సుష్మా ఆ హాస్పిటల్పై చర్యకు బుల్డోజర్ను రప్పించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆసుపత్రి డైరెక్టర్ దీనిపై స్పందించారు. మేయర్, తమ సిబ్బంది మధ్య ఎలాంటి వాగ్వాదం లేదా ఘర్షణ జరుగలేదని తెలిపారు. తమ ఆసుపత్రిపై బుల్డోజర్ చర్యకు మేయర్ ఆదేశించినట్లుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు.