Sachin Pilot | రాజస్థాన్లోని అధికార కాంగ్రెస్లో కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. సీఎం అశోక్ గెహ్లాట్కు, యువ నేత సచిన్ పైలట్ మధ్య విభేదాలకు రాష్ట్ర మంత్రి ఆజ్యం పోశారు. సచిన్ పైలట్ కష్టపడటం వల్లే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఆయనకు బాధ్యతలు అప్పగించాల్సిందేనని రాష్ట్ర మంత్రి హేమరామ్ చౌదరి చెప్పారు. సచిన్ పైలట్కు ప్రమోషన్ తప్పనిసరి, ఇక వేచి చూసే ప్రసక్తే లేదు, దీనిపై పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. సచిన్ పైలట్కు హేమరామ్ చౌదరి అత్యంత సన్నిహితుడు.
గత సెప్టెంబర్లో రాజస్థాన్లో జరిగిన పరిణామాలపై సచిన్ పైలట్ అసాధారణ రీతిలో మండిపడ్డారు. భవిష్యత్ సీఎం ఎవరన్న సంగతి ఖరారు చేసేందుకు సెప్టెంబర్లో ఏర్పాటు చేసిన సీఎల్పీ సమావేశానికి గైర్హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలను శిక్షించాల్సిందేనని మూడు వారాల క్రితం పైలట్ డిమాండ్ చేశారు. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారిని తప్పనిసరిగా శిక్షించాలన్నారు. అశోక్ గెహ్లాట్ స్థానంలో సచిన్ పైలట్ను సీఎంగా నియమించకుండా అడ్డుకునేందుకు 90 మంది గెహ్లాట్ ఎమ్మెల్యేలు విడిగా సమావేశమయ్యారు.
బహిరంగంగా ప్రధాని నరేంద్రమోదీని సీఎం గెహ్లాట్ ప్రశంసిస్తున్నారని సచిన్ పైలట్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీజేపీకి అనుకూలంగా సంకేతాలిస్తున్నారని గెహ్లాట్ తీరును ప్రశ్నించారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్ మద్దతు పలుకుతున్నారు.