జైపూర్ : బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతున్నదని రాజస్ధాన్ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లోట్ (Ashok Gehlot) మండిపడ్డారు. కాషాయ నేతలు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంలో తలమునకలైనప్పుడు మణిపూర్ అల్లర్లలో వంద మంది మరణించారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్ను సందర్శించిన అనంతరం కూడా ఉద్రిక్తతలు కొనసాగాయని గెహ్లోట్ గుర్తుచేశారు. మణిపూర్ మండుతున్నా ఆ విషయాన్ని కేంద్రం సీరియస్గా తీసుకోవడంలో విఫలమవుతున్నదని అన్నారు.
మతం పేరిట బీజేపీ రాజకీయాలు నడుపుతున్నదని ప్రజలు అర్ధం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇక అంతకుముందు పట్నాలో విపక్ష నేతల భేటీకి ముందు పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడారు. బిహార్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే అది దేశవ్యాప్తంగా పార్టీ పునరుత్తేజానికి దోహదం చేస్తుందని ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం సదకత్ ఆశ్రమ్లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే మాట్లాడారు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్య కోసం ప్రజలంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ తాము సామాన్యుడి వెన్నంట నిలిస్తే బీజేపీ మాత్రం కేవలం ఇద్దరు ముగ్గురు అత్యంత సంపన్నులు, బడా పారిశ్రామికవేత్తలకే మేలు చేస్తోందని మండిపడ్డారు. త్వరలో ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్దాన్, చత్తీస్ఘఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, బీజేపీ తమ దరిదాపుల్లోకి రాదని రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు అవసరమైన వ్యూహాలను రూపొందించేందుకు బిహార్ సీఎం నితీష్ కుమార్ నివాసంలో విపక్ష నేతలు సమావేశమయ్యారు.
Read More :