(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): గౌరవప్రదమైన వేతనం ఇవ్వాలని, పనిచేసే చోట కనీస వసతులను కల్పించాలంటూ బీజేపీ పాలిత హర్యానాలో ఆశావర్కర్లు నిరసనబాట పట్టారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దాదాపు 20 వేల మంది ఆశాలు గత నెల రోజులుగా ఈ ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనం రూ. 4 వేలు ఎంతమాత్రం సరిపోవట్లేదని, వేతనాన్ని రూ. 26 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
పెరిగిన ధరలకు వేతనాలు చాలట్లే!
2018 కంటే ముందు గౌరవ వేతనం రూ. 1000గా ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 4 వేలుగా ఇస్తున్నారు. పెరిగిన ధరలు, అవసరాలకు ఈ మొత్తం ఏ మాత్రం సరిపోవట్లేదు. ప్రభుత్వం వెంటనే వేతనాలను పెంచాలి.
-సనీతా రాణి, ఆశా వర్కర్