న్యూఢిల్లీ : అసని తుఫాను ముంచుకొస్తుంది. తుఫాను ప్రభావంతో పలు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారుతున్నది. రాబోయే 24 గంటల్లో బంగాళాఖాతం మీదుగా ముందుకు కదులుతుందని, ఈ సమయంలో 45-75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని పేర్కొంది. తుఫాను ప్రభావంతో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడిందని, రాబోయే 24 తుఫానుగా బలపడి తూర్పు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు.
శనివారం సాయంత్రానికి అల్పపీడనం మరింత బలపడి 24 గంటల తర్వాత బంగాళాఖాతంలో తుఫానుగా మారనుందని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నాటికి ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశాను చేరుకుంటుందని పేర్కొన్నారు. అసని తుఫాను ఈ నెల 10, 11 తేదీల్లో విశాఖపట్నం, భువనేశ్వర్ను తాకే అవకాశం ఉందని పేర్కొన్నారు. భారత సముద్ర ప్రాంతాల్లో తుఫాను సంభవించడం ఇది మూడో సారి అని ఐఎండీ చెప్పింది. 2020లో వచ్చిన ఆంఫన్ తుఫాను పశ్చిమ బెంగాల్ను ప్రభావితం చేసింది. 2021లో యాస్ తుఫాను ఒడిశాపై ప్రభావం చూపింది. అసని తుఫాను సైతం ఒడిశాపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. శుక్రవారం భారత తీరానికి వెయ్యి కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది.
తుఫాను కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సమయంలో తూర్పు-మధ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో గాలులు గంటకు 45-65 కిలోమీటర్ల వరకు చేరే అవకావం ఉందని పేర్కొంది. మరో వైపు సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలను వాతావరణశాఖ అప్రమత్తం చేసింది. అలాగే మత్స్యకారులకు సైతం హెచ్చరికలు జారీ చేశారు. ఈ నెల 8 నుంచి 9 తేదీల మధ్య ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు మధ్య ప్రాంతాల్లో గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.