హిజబ్ వివాదం కాస్త చల్లారిందనే లోపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన ట్వీట్తో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. హిజబ్పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చేసిన ట్వీట్ దుమారం రేపుతోంది. ఇన్షా… ఏదో ఒకరోజు హిజబ్ ప్రధానమంత్రి అవుతారు అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. హిజబ్ ధరించాలని ఓ ఆడపిల్ల తన తల్లిదండ్రులతో అంటుంది. అందుకు వారి తల్లిదండ్రులు కూడా దీనికి సరేనంటారు. ఎవరు ఆపుతారో చూద్దాం అని ధైర్యం చెబుతారు. హిజబ్ ధరించి డాక్టర్ కూడా అవుతుంది. కలెక్టర్ కూడా అవుతుంది. బిజినెస్మెన్ కూడా అవుతుంది. దేవుడి దయవల్ల ఏదో ఒకరోజు హిజబ్ ధరించిన వారు ప్రధాని కూడా అవుతారు. నేను బతికి లేకున్నా… హిజబ్ ధరించిన వారు ప్రధాని అవుతారు. ఇది తథ్యం అంటూ ఒవైసీ ఓ వీడియోను ట్వీట్ చేశారు.
హిజబ్ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం ఏమాత్రం సరికాదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశాన్ని కర్నాటక హైకోర్టు పరిశీలిస్తోందని, మా రాజ్యాంగ విధివిధానాలు, ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా ఈ విషయాన్ని పరిష్కరించుకుంటామని బాగ్చీ పేర్కొన్నారు.