న్యూఢిల్లీ : రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లో స్వామి యతి నర్సింగానంద్ పేరును కూడా పోలీసులు పొందుపరిచారు. బహిష్కృత బీజేపీ నేత నూపుర్ శర్మ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించిన నేపధ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఇక నూపుర్ శర్మపైనా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆమెతో పాటు కాషాయ పార్టీ బహిష్కృత నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సవా నక్వీపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది. నూపుర్ శర్మపై సెక్షన్ 153, సెక్షన్ 295ల కింద ఘర్షణలు ప్రేరేపించేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేయడం వంటి అభియోగాలు మోపారు.
వివిధ వర్గాల ప్రజల మధ్య సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడినందుకు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కు చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రేటజిక్ ఆపరేషన్ (ఐఎఫ్ఎస్ఓ) విభాగం ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది.