లౌడ్ స్పీకర్ల తొలగింపు అంశం మహారాష్ట్రలో ఇప్పుడే సద్దు మణిగేలా లేదు. ఔరంగాబాద్లో జరిగిన ర్యాలీలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. మే 3 వరకూ మారు మాట్లాడనని, 4 నుంచి ఎవ్వరి మాటా విననంటూ సవాల్ విసిరారు. లౌడ్ స్పీకర్లో వచ్చే సౌండ్ కంటే నాలుగింతల సౌండ్తో హనుమాన్ చాలీసా చదవడం గ్యారెంటీ అంటూ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. పోలీసులు సుమోటోగా ఆయనపై కేసులెందుకు పెట్టరని ప్రశ్నించారు. ఈయనను వెంటనే జైల్లో వేసేస్తే.. సరిపోతుందని, అప్పుడు ఆయన చల్లబడతారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
ప్రజాస్వామ్యంలో వ్యక్తి పెద్దవాడా? వ్యవస్థ పెద్దదా? అంటూ ఒవైసీ సూటిగా ప్రశ్నించారు. నవనీత్ రాణా దంపతులను జైల్లో వేసినప్పుడు రాజ్ థాకరేను ఎందుకు జైల్లో వేయరని ఉద్ధవ్ను ప్రశ్నించారు.ఒక్క వ్యక్తి ఔరంగాబాద్ భద్రతను అపాయంలోకి తోసేస్తారా? అంటూ ఒవైసీ ప్రశ్నించారు. హింసను ప్రేరేపించడానికి రాజ్ థాకరే వ్యాఖ్యలు బహిరంగ ఆహ్వానం లాంటివంటూ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.