న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ అవకతవకలపై నివేదిక వెల్లడించిన హిండెన్బర్గ్ రీసెర్చ్ భారత సంస్ధ అయితే కాషాయ పాలకులు దాని భరతం పట్టేవారని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఓవైసీ బుధవారం లోక్సభలో మాట్లాడుతూ మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
హిండెన్బర్గ్ దేశీ సంస్ధ అయితే దానిపై చట్టవ్యతిరేక కార్యకలాపాల న(నియంత్రణ) చట్టాన్ని ప్రయోగించేవారని అన్నారు. కేంద్ర బడ్జెట్లో మైనారిటీ సంక్షేమ పధకాల్లో భారీ కోత విధించారని దుయ్యబట్టారు. ముస్లిం విద్యార్ధులు చదువుకోకూడదని బీజేపీ కోరుకుంటోందని అన్నారు.
పస్మాండ ముస్లింలపై మీకు అంత ప్రేమ ఉంటే వారికి దళిత ముస్లింల హోదా కట్టబెట్టాలని కోరారు. మువ్వన్నెల పతాకం నుంచి ఆకుపచ్చ రంగును మోదీ ప్రభుత్వం తొలగిస్తుందా అని ప్రశ్నించారు. గ్రీన్ కలర్తో ప్రభుత్వానికి ఎందుకు అన్ని సమస్యలు ముంచుకొస్తున్నాయని నిలదీశారు. అసలు ప్రధాని మోదీ చైనా గురించి ఎందుకు మాట్లాడారు..బిల్కీస్ బానోకు న్యాయం జరిగిందా అని ఓవైసీ ప్రశ్నించారు. బీహార్లో ముస్లింలకు ఓబీసీ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.