Tamil Nadu rains : తమిళనాడు (Tamil Nadu) లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కడలూరు జిల్లా (Cuddalore) లో భారీ వర్షాల (Heavy rains) కు ఓ నివాసం కూలిపోయింది. దాంతో ఆ ఇంట్లోని ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రాబోయే 24 గంటల్లో తీరందాటే అవకాశం ఉండటంతో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా జిల్లాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంతకుముందే భారత వాతావరణ విభాగం హెచ్చరించింది.
తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుతురై జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు, కడప జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 24 గంటల వ్యవధిలో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఈ వర్షాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం సహాయక చర్యలను ముమ్మరం చేసింది. రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాలకు 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పర్యవేక్షకులుగా నియమించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సహాయక శిబిరాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
చెంగల్పట్టు కలెక్టర్ డి స్నేహ మాట్లాడుతూ.. వర్షాలకు ముందే పూడికతీత పనులు పూర్తి చేశామని, నీటిని తోడే పంపులు, సహాయక కేంద్రాలు, కమ్యూనిటీ కిచెన్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భారీ వర్షాల కారణంగా తమిళనాడులోని 13 జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. తూత్తుకూడి, తిరువారూర్ జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది.
నాగపట్నం, తిరువారూర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జేసీబీలు, బోట్లు, చెట్లను తొలగించే యంత్రాలతోపాటు జాతీయ విపత్తు స్పందన దళం (NDRF) బృందాలను సిద్ధంగా ఉంచారు.