పాట్నా: చలి దుస్తులు లేకపోవడంతో చలికి తట్టుకోలేక ప్రేయర్ సమయంలో స్కూల్ విద్యార్థి అపస్మారకంగా పడిపోయాడు. ఆసుపత్రికి తరలించగా ఆ బాలుడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. (Student Dies Of Cold) ఆ విద్యార్థి చలి దుస్తులు ధరించకపోవడం వల్ల ఈ సంఘటన జరిగినట్లు పేర్కొన్నారు. బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చాకియాలోని ఆదర్శ ప్రభుత్వ మిడిల్ స్కూల్లో పదేళ్ల మనీష్ కుమార్ ఆరో తరగతి చదువుతున్నాడు. చలి దుస్తులు లేకపోవడంతో వాటిని ధరించకుండా బుధవారం బడికి వచ్చాడు. ప్రార్థన సమయంలో ఉన్నట్టుండి కిందపడిపోయాడు.
కాగా, టీచర్లు వెంటనే ఆ విద్యార్థిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఆ బాలుడి కుటుంబానికి తెలిపారు. అయితే ఆ విద్యార్థి చనిపోయినట్లు ఆసుపత్రికి చేరుకున్న కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. పెద్దగా రోధించడంతో అక్కడ కలకలం రేగింది. ఈ సంగతి తెలిసిన పోలీసులు
ఆసుపత్రికి చేరుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఆ బాలుడిని అతడి కుటుంబ సభ్యులు కొట్టారని, దీంతో అతడు భోజనం చేయకుండా, చలి దుస్తులు ధరించకుండా స్కూల్కు రావడంతో అస్వస్థతకు గురయ్యాడని జిల్లా విద్యాశాఖ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు. పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వాస్తవాలు వెల్లడవుతాయని ఆయన అన్నారు.