ఇంఫాల్ : మణిపూర్ హింసాకాండ (Manipur Violence) కొనసాగుతూ రోజూ హత్యలు, లైంగిక దాడులు, అల్లర్ల వార్తలు వెలుగుచూస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంశంపై నోరు మెదపకపోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు నెలలుగా మణిపూర్ భగ్గుమంటున్నా ప్రభుత్వాలు తమకేమీ పట్టనట్టు వ్యవహరించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మణిపూర్ అల్లర్ల నేపధ్యంలో ఇద్దరు మహిళలను కొందరు నగ్నంగా ఊరేగించిన ఘటన పెను దుమారం రేపింది.
ఇంత జరిగినా మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సీరియస్గా స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మణిపూర్లో ప్రస్తుత పరిస్ధితిపై సోమవారం కొందరు మీడియా ప్రతినిధులు సీఎంను నిలదీసి ప్రశ్నల వర్షం కురిపించినా మొక్కుబడిగా మాట్లాడిన బీరేన్ సింగ్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకుండానే వెనుదిరిగారు.
మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితులను అరెస్ట్ చేయడంలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించగా మణిపూర్ ఘటనకు సంబంధించి నిందితులందరినీ అరెస్ట్ చేశామని ఆయన బదులిచ్చారు. మణిపూర్లో ఉద్రిక్త పరిస్ధితి కొనసాగడం, సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్లను మీడియా ప్రస్తావించగా ఎలాంటి సమాధానాలు ఇవ్వకుండా ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read More :