Arvind Kejriwal | చండీగఢ్ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 35 వార్డులుంటే.. అందులో 14 వార్డుల్లో ఆప్ జయకేతనం ఎగురవేసింది. అంతేకాకుండా బీజేపీ సిట్టింగ్ మేయర్ రవికాంత్ శర్మ ను ఆప్ అభ్యర్థి జస్బీర్ సింగ్ ఓడించి, బీజేపీకి ఝలక్ ఇచ్చారు. ఇక బీజేపీ 12 సీట్లలో గెలిస్తే, కాంగ్రెస్ 8 వార్డుల్లో గెలిచింది. అకాలీదళ్ ఒక స్థానాన్ని గెలుచుకుంది. చండీగఢ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తాము మొదటిసారి బరిలోకి దిగామని, అయినా ప్రజలు ఎంతో ఆదరించి, ఆహ్వానం పలికారని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా సంతృప్తి వ్యక్త చేశారు.
చండీగఢ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించడంపై ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. పంజాబ్లో రాబోయే మార్పుకు ఈ ఫలితాలే సంకేతమని ట్వీట్ చేశారు. అవినీతి రాజకీయాలను ప్రజలు చీదరించుకున్నారని, నిజాయితీతో నడిచే ఆప్ రాజకీయ విధానాలకు జై కొట్టారని పేర్కొన్నారు. మార్పుకు పంజాబ్ రెడీగా ఉందని, గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.