న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టేందుకు ఢిల్లీ సీఎం, ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఉచిత విద్యుత్ హామీతో ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జూన్ 26న గుజరాత్ పర్యటనలో భాగంగా విద్యుత్పై టౌన్ హాల్ మీటింగ్లో కేజ్రీవాల్ పాల్గొంటారు. ఈ క్రమంలో ఉచిత విద్యుత్ హామీని ప్రజల ముందుంచేందుకు ఆప్ కసరత్తు సాగిస్తోంది.
గుజరాత్లో విద్యుత్ టారిఫ్ దేశంలోనే అత్యధికంగా ఉందని ఆప్ ఆరోపిస్తోంది. గ్రామాల్లో విద్యుత్ సరఫరాల్లో తీవ్ర అవాంతరాలు కలుగుతున్నాయని, రైతులకు 24 గంటల విద్యుత్ సరఫరా అందుబాటులో లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఢిల్లీ, పంజాబ్ తర్వాత గుజరాత్లో ఉచిత విద్యుత్ పధకానికి శ్రీకారం చుడతామని ఆప్ భరోసా ఇవ్వనుంది. ఉచిత విద్యుత్ కోసం ఆప్ భారీ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.
ఉచిత విద్యుత్ కోరుతూ జన్ సంవాద్ క్యాంపెయిన్ను చేపడుతోంది. ఉచిత విద్యుత్ కల్పించాలని కోరుతూ ఆప్ నేతలు జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు సమర్పిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. గుజరాత్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ పేరుతో గుజరాత్ ప్రభుత్వం ప్రజలను లూటీ చేస్తోందని, విద్యుత్ కంపెనీలతో లాలూచీ పడి ప్రజలను దోపిడీ చేస్తున్న తీరును ఎండగడతామని ఆప్ నేత గోపాల్ ఇతాలియ పేర్కొన్నారు.