రాజ్కోట్, సెప్టెంబర్ 3: గుజరాత్ బీజేపీ కార్యకర్తలకు ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక ప్రతిపాదన చేశారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ విజయం కోసం పనిచేయాలని కోరారు. బీజేపీ నుంచి ‘పేమెంట్’ పొందడం కొనసాగించవచ్చని, అయితే ఇదే సమయంలో ఆప్ కోసం అంతర్గతంగా పనిచేయాలని సూచించారు. గుజరాత్ పర్యటనలో రెండో రోజు శనివారం రాజ్కోట్లో మీడియాతో మాట్లాడారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చే అన్ని హామీల ద్వారా బీజేపీ కార్యకర్తలు లబ్ధి పొందుతారని అన్నారు. ఇటీవల గుజరాత్ ఆప్ ప్రధాన కార్యదర్శి మనోజ్ సొరాథియాపై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ఆప్కు మద్దతు పలుకుతున్నందుకు ప్రజలపై కూడా దాడులు చేస్తారని, ఓటమి భయంతో బీజేపీ నిరాశలో కూరుకుపోయిందని విమర్శించారు. ఇటువంటి దాడులకు భయపడేది లేదని హెచ్చరించారు.