న్యూఢిల్లీ : పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సవరణ (ఎంసీడీ) బిల్లును అధ్యయనం చేస్తున్నామని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. అవసరమైతే ఎంసీడీ బిల్లును కోర్టులో సవాల్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
నగరపాలక సంస్ధ ఎన్నికలను నిలిపివేసేందుకే ఎంసీడీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిందని కేజ్రీవాల్ ఆరోపించారు. వార్డుల సంఖ్యను 272 నుంచి 250కి కుదించడం అంటే డీలిమిటేషన్ కిందకు వస్తుందని దీని అర్ధం ఎన్నికలు నిర్వహించరాదని కేంద్రం ఉద్దేశంగా కనిపిస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఈ బిల్లు ద్వారా ఎంసీడీ కేంద్రం కనుసన్నల్లోకి వెళుతుందని ఆరోపించారు.
ప్రస్తుతం ఢిల్లీలో ప్రాంతాలవారీగా మూడు నగరపాలక సంస్ధలుండగా వాటిని ఒక కార్పొరేషన్లో విలీనం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్సభలో ఎంసీడీ బిల్లును ప్రవేశపెట్టింది. దేశ రాజధానిలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేసే బిల్లును ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అభివర్ణించారు.