న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీ ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచిన సిసోడియాకు భారత్ రత్న పురస్కారం అందచేయాలని అన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా శాఖ మంత్రి తమతో ఉన్నారని, న్యూయార్క్ టైమ్స్లో ఆయన ఫోటో ప్రచురించారని కొనియాడారు. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం చేపట్టిన విద్యా విధానానికి న్యూయార్క్ టైమ్స్ పత్రిక కితాబిచ్చిందని గుర్తుచేశారు. కాగా ఈ ఏడాది చివరిలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ ఉవ్విళ్లూరుతుండగా పాలక బీజేపీ విజయాలకు బ్రేక్ వేసి అధికార పగ్గాలు చేపట్టాలని కాంగ్రెస్ తనదైన వ్యూహాలకు పదునుపెడుతోంది.
ఇక 1995 నుంచి అప్రతిహతంగా గుజరాత్లో పాగా వేసిన పాలక బీజేపీ మరోసారి అందలమెక్కేందుకు అర్రులుచాస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రంలో ఎలాగైనా గెలిచితీరాలని కమలనాధులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.