అహ్మదాబాద్ : త్వరలో అసెంబ్లీ ఎన్నికలకు జరగనున్న గుజరాత్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. గుజరాత్లో మార్పు అవసరమని చెప్పిన కేజ్రీవాల్ త్వరలో రాష్ట్రంలో మనీష్ సిసోడియా ర్యాలీ నిర్వహిస్తారని ట్వీట్ చేశారు. అయితే ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా ఏ రోజున గుజరాత్లో ప్రదర్శన చేపడతారనే వివరాలను కేజ్రీవాల్ వెల్లడించలేదు.
సిసోడియా ర్యాలీని స్వాగతించిన ఆప్ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాతీలు మార్పును కోరుతూ ఆప్నకు పట్టం కట్టాలని అభ్యర్ధించారు. ఆప్ అధికారం చేపట్టగానే ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి అవకాశాలను అందిస్తుందని హామీ ఇచ్చారు. ఢిల్లీలో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన మనీష్ సిసోడియాను స్వాగతిస్తున్నామని గోపాల్ ఇటాలియా ట్వీట్ చేశారు.