న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వాలను కూలదోసేందుకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను వాడుకుంటోందని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనపై చేసిన ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు.
దర్యాప్తు ఏజెన్సీ దాఖలు చేసిన చార్జిషీట్ను ఊహాజనితమైనదిగా కేజ్రీవాల్ కొట్టిపారేశారు. ఈడీ దర్యాప్తు తీరును ఎండగడుతూ మోదీ ప్రభుత్వ హయాంలో దర్యాప్తు ఏజెన్సీ దాదాపు 5000 కేసులను నమోదు చేస్తే ఎంతమందిని శిక్షించిందని ప్రశ్నించారు.
ఈడీ దాఖలు చేసే చార్జిషీట్లన్నీ బూటకమని కేజ్రీవాల్ తేల్చేశారు. ఈడీని కేంద్రం కేవలం విపక్ష సర్కార్లను కూల్చేందుకే వాడుకుంటున్నదని మండిపడ్డారు. అవినీతిని అంతమొందించేందుకు ఈడీ కేసులు నమోదు చేయడం లేదని, ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసేందుకు ఉపకరించేందుకే కేసులతో భయపెడుతున్నదని అన్నారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ గురువారం అనుబంధ చార్జిషీట్ను దాఖలు చేసింది.