Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తు్న్నది. గురువారం రాత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడానికి ముందు ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. ఈ సోదాల్లో 150 పేజీల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని మీడియాలో వార్తలొచ్చాయి. ఆ పత్రాల్లో ఉన్న వివరాలు చూసిన ఈడీ అధికారులు షాక్ అయ్యారని ఆ కథనాల సారాంశం. ఈ పత్రాల్లో దర్యాప్తు సంస్థకు చెందిన ఇద్దరు అధికారుల కీలక సమాచారం ఉందని తెలుస్తున్నది.
మద్యం కేసు దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు ఈ పత్రాల ద్వారా తెలుస్తున్నది. స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ ర్యాంక్ అధికారుల పేర్లు అందులో ఉన్నాయి. అయితే భద్రతా కారణాల రీత్యా వాటి వివరాలను వెల్లడించడం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో తదుపరి విచారణ, తీసుకోవాల్సిన చర్యలపై సదరు అధికారులు తమ ఉన్నతాధికారులకు నివేదించారని తెలుస్తున్నది.