సిమ్లా : హిమాచల్ ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. కులులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ శనివారం రోడ్షో నిర్వహించారు. రాష్ట్రంలో రాజకీయాలు చేసేందుకు తాము రాలేదని ఆప్ అవినీతిని రూపుమాపడమే అజెండాగా పనిచేస్తుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. తమకు రాజకీయాలు తెలియవని తొలుత తాము ఢిల్లీలో అవినీతిని అంతమొందించి ఆపై పంజాబ్లోనూ అవినీతి నిర్మూలనకు పాటుపడుతున్నామని అన్నారు.
అవినీతి ఆరోపణలపై పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన సహచర మంత్రిని జైలు పంపారని గుర్తుచేశారు. అవినీతిని కప్పిపెట్టవచ్చని కానీ తాము అలా చేయబోమని స్పష్టం చేశారు. తమ మంత్రిని జైలుకు పంపిన సీఎం గురించి మీరు ఎక్కడైనా విన్నారా అని రోడ్షోకు హాజరైన ప్రజలను కేజ్రీవాల్ ప్రశ్నించారు. మీడియా, విపక్షాలకు తెలియక ముందే అవినీతిని పసిగట్టిన భగవంత్ మాన్ తన మంత్రివర్గ సహచరుడిని జైలుకు పంపారని చెప్పారు.
మాన్ తలుచుకుంటే మంత్రి అవినీతి బాగోతం బయటకు రాకుండా చూసేవారని, తనకూ ముడుపుల్లో వాటా ఇవ్వాలని కోరేవారని కానీ మాన్ అలా చేయలేదని నిజాయితీగా వ్యవహరించారని ప్రశంసించారు. ఇక త్వరలో జరిగే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పాలక బీజేపీ, కాంగ్రెస్, ఆప్ల మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావిస్తున్నారు.