ఇటానగర్: భారత్, చైనా సరిహద్దు ప్రాంతంలో అరుణాచల్ ప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు అదృశ్యమయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఆ యువకుల కోసం వెతుకుతున్నారు. అంజావ్ జిల్లా గోయిలాంగ్ పట్టణానికి చెందిన బటేలమ్ టిక్రో, బేయింగ్సో మన్యు అనే ఇద్దరు యువకులు వైద్య మొక్కల కోసం అన్వేషిస్తూ చైనా సరిహద్దు సమీప ప్రాంతంలో కనిపించకుండా పోయారు. దీంతో ఈ నెల 9న వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో భారత సైన్యాన్ని సంప్రదించామని, అదృశ్యమైన యువకుల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అంజావ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రికి కమిసి తెలిపారు.
కాగా, ఆ ఇద్దరు యువకులు ఆగస్ట్ 19న చగ్లగం ప్రాంతానికి వెళ్లి కనిపించకుండా పోయినట్లు వారి తల్లిదండ్రులు తెలిపారు. వారి కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఆ ఇద్దరు యువకులు పొరపాటున చైనా భూభాగంలోకి ప్రవేశించి ఉంటారని, ఆ దేశ సైనికులు వారిని నిర్బంధించి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.