ఇటానగర్ : పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నైట్ కర్ఫ్యూ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసివేస్తున్నట్లు పేర్కొంది. పని రోజుల్లో ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపింది.
విశ్వవిద్యాలయాలు, కళాశాల, సాంకేతిక సంస్థలు 50శాతం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు రెండు డోసుల టీకా తీసుకుంటేనే అరుణాచల్ప్రదేశ్లోకి అనుమతించనున్నారు. కార్యాలయాలు, బార్లు, రెస్టారెంట్లు, జిమ్లు, ప్రజా రవాణా, స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాళ్లు 50శాతం సామర్థ్యంతో పని చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
సమావేశాలపై నిషేధం విధించింది.