గువాహటి: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే యమ్సేన్ మెటీ (Yumsen Matey) హత్య కేసును అరుణాచల్ప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించింది. ఈ నెల 16న మయన్మార్ సరిహద్దుల్లో యమ్సేన్ దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక పోలీసులు.. ఈ హత్య వెనుక ఉగ్రసంస్థ ఎన్ఎస్సీఎన్-కేవైఏ (NSCN-KYA) హస్తం ఉన్నదని అనుమానిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీచేసింది.
స్థానికంగా ప్రముఖ నాయకుడైన యమ్సేన్ మెటీ.. 2009లో జరిగిన ఎన్నికల్లో ఖోన్సా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. అప్పటి ప్రభుత్వంలో మహిళా సామాజిక న్యాయం, గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2015లో బీజేపీలో చేరారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నానని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో డిసెంబర్ 16న తిరప్ జిల్లాలోని రాహో గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన అనుచరులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేతోపాటు మరో ముగ్గురిని పలువురు మయన్మార్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై సమీపం నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే మృతిచెందారు.