Indian Army | న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఆర్మీ కీలక నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తున్నది. శత్రువుల సైనిక మోహరింపుపై నిఘా పెట్టేందుకు కృత్రిమ మేధ సాయం తీసుకొనే యోచనలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆర్మీ ఏఐ ఆధారిత దేశీయంగా అభివృద్ధి చేసిన సాఫ్ట్వేర్ను వినియోగించనున్నదని తెలిపాయి.
ఈ కొత్త సాంకేతికత సరిహద్దుల వెంబడి శత్రు దేశాల సైన్యం మోహరించిన ఆయుధాలు, యుద్ధ వాహనాలు, ఇతర యుద్ధ పరికరాల ఎలక్ట్రానిక్ పరమైన వివరాలను సేకరిస్తుందని, తద్వారా భవిష్యత్తులో మనం చేపట్టాల్సిన చర్యలను నిర్దేశించుకోవడంలో సహకరిస్తుందని వివరించాయి. శాటిలైట్లు, రాడార్లు ఆధారంగా ఏఐ సాఫ్ట్వేర్ డాటా సేకరిస్తుందని పేర్కొన్నాయి.