మళ్లీ వచ్చి వేరే జాబ్ కోసం చదువుకోవాలా?
అగ్నిపథ్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత
సీఏపీఎఫ్లో అగ్ని వీరులకు ప్రాధాన్యం: కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 15: రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉద్యోగార్థులతో పాటు, మాజీ, ప్రస్తుత సైనికాధికారులు కూడా ఈ కార్యక్రమంపై అభ్యంతరం లేవనెత్తుతున్నారు. బీహార్లోని ముజఫర్పూర్, బక్సర్లో బుధవారం అగ్నిపథ్ కార్యక్రమానికి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. అగ్నిపథ్ ద్వారా సాయుధ బలగాల్లో చేరినవాళ్లు నాలుగేండ్ల తర్వాత ఏం చేయాలని పలువురు ప్రశ్నిస్తున్నారు. ‘నాలుగేండ్లు సైన్యంలో విధులు నిర్వహించి మళ్లీ వచ్చి వేరే ఉద్యోగం కోసం చదువుకోవాలా’ అని గుల్షాన్ కుమార్ అనే విద్యార్థి ప్రశ్నించాడు. ‘ఆర్మీలో చేరడానికి రెండేండ్లుగా కష్టపడుతున్నాను. నాలుగేండ్లే ఉద్యోగం అంటే ఎలా? నాలుగేండ్లు ఉద్యోగం చేయడానికి రెండేండ్లు కష్టపడాలా’ అని శివమ్ కుమార్ వాపోయాడు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా రాజస్థాన్లోని జైపూర్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి.
సర్వీస్ కాలం పెంచాలి
అగ్నిపథ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 17.5-21 ఏండ్ల వయస్సున్న 45వేల మందిని సాయుధ బలగాల్లో రిక్రూట్ చేస్తారు. వీళ్లు నాలుగేండ్లు పనిచేయాలి. తర్వాత వీరిలో పావు వంతు మందిని మాత్రమే బలగాల్లో కొనసాగిస్తారు. మిగతావారికి రూ.11 లక్షల ప్యాకేజీ ఇచ్చి పంపిస్తారు. దీనిపై రిటైర్డ్ మేజర్ జనరల్ బీఎస్ ధనోవా అభ్యంతరం తెలిపారు. ‘సర్వీసు కాలాన్ని నాలుగేండ్ల నుంచి కనీసం ఏడేండ్లకు పెంచాలి. సర్వీసులో కొనసాగించేవారి సంఖ్యను 50% చేయాలి’ అని కేంద్రానికి సూచించారు. సాయుధ బలగాలను ఆర్థిక దృక్కోణంలో చూడవద్దని సీనియర్ ఆర్మీ అధికారి మేజర్ జనరల్ యశ్ మోర్ అభిప్రాయపడ్డారు.
అగ్నివీరుల కోసం ప్రత్యేక డిగ్రీ
అగ్నిపథ్లో భాగంగా సాయుధ బలగాల్లో చేరిన వారి(అగ్నివీరులు)కోసం కేంద్ర విద్యాశాఖ ప్రత్యేకంగా బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రాంను ప్రారంభించనున్నది. ఇగ్నో ఈ డిగ్రీ కోర్సును అందిస్తుంది. ఇందుకోసం త్రివిధ దళాలు త్వరలోనే ఇగ్నోతో ఒప్పందం చేసుకోనున్నాయి. దీంట్లో సాయుధ బలగాల్లో పొందిన శిక్షణకు 50% క్రెడిట్లు ఉంటాయి. మిగతా సబ్జెక్టులకు 50% క్రెడిట్లు ఉంటాయి. ‘ఈ డిగ్రీకి దేశవ్యాప్త గుర్తింపు ఉంటుంది. విదేశాల్లో విద్యాభ్యాసానికి కూడా ఈ డిగ్రీ చెల్లుతుంది’ అని కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా, అస్సాం రైఫిల్స్, కేంద్ర సాయుధ పోలీసు బలగాల(సీఏపీఎఫ్) నియామకాల్లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఉంటుందని కేంద్ర హోంశాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.