Jammu Kashmir | జమ్ముకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి భారత్ భూభాగంలోకి ప్రవేశించాలన్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. వారి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నామని సైన్యం గురువారం వెల్లడించింది. `ఈ నెల 14,15 తేదీల్లో కృష్ణఘటి, పూంచ్ సెక్టార్ పరిధిలో కశ్మీర్ లోయలోకి రావడానికి ప్రయత్నించిన ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశాం. బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత చొరబాటుకు ప్రయత్నించారు. సైనికులు అప్రమత్తమై కాల్పులు జరపడంతో వారంతా తప్పించుకుని పారిపోయారు` అని సైన్యాధికారులు తెలిపారు.
గురువారం తెల్లవారుజామున ఎల్వోసీ పరిధిలోని సర్లా గ్రామంలో జరిపిన గాలింపుల్లో ఆయుధాలు దొరికాయని సైన్యాధికారులు వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆర్మీ జరిపిన తనిఖీల్లో రెండు బ్యాగుల్లో ఒక ఏకే సిరీస్ రైఫిల్, తొమ్మిది మ్యాగజైన్లు, సాధారణ బుల్లెట్లు, రెండు పిస్టళ్లు, నాలుగు మ్యాగజైన్లు, 60 బుల్లెట్లు, ఆరు గ్రనైడ్లు తదితర ఆయుధ సామగ్రి లభించింది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సైనిక వర్గాలు తెలిపాయి.