కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపు
న్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియోగించిన దళాలను తూర్పు లఢక్కు తరలించింది. సుమారు 15 వేల మంది సైనికులను కొన్నాళ్లక్రితం లఢక్ సెక్టార్కు పంపినట్టు అధికార వర్గాలు తెలిపాయి. చైనా సైన్యం తలపెట్టే ఎలాంటి దుస్సాహక చర్యనైనా దీటుగా ఎదుర్కోవడంలో ఈ అదనపు దళాలు లేహ్లోని సైనిక ప్రధాన కార్యాలయానికి అండదండలు అందిస్తాయని పేర్కొన్నాయి. గత ఏడాది వాస్తవాధీన రేఖ వెంబడి చైనా జరిపిన చొరబాట్ల కారణంగా భారత్ సైనిక తరలింపును ముమ్మరం చేసింది. దీంతో ఎప్పుడూ ఒకడివిజన్ సైన్యం మాత్రమే ఉండే లఢక్లో ఇప్పుడు రెండు డివిజన్ల సైన్యం మోహరించింది. పలు భారీ శతఘ్నులు, ఇతర ఆయుధాలను బలగాలకు అండగా సిద్ధం చేశారు. మరోవైపు చైనా ముందుకు వస్తే మొదటగా ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పర్వతయుద్ధ యూనిట్లను కూడా బలోపేతం చేస్తున్నారు.
పాక్లో కలుస్తారా? స్వతంత్రంగా ఉంటారా?: ఇమ్రాన్
ఇస్లామాబాద్: కశ్మీర్ ప్రజలు పాకిస్తాన్లో కలుస్తారా? స్వతంత్రంగా ఉంటారా? అన్నది వాళ్ల ఇష్టమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్ వ్యాఖ్యానించారు. పీవోకేలోని తరార్ఖాల్లో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఇమ్రాన్.. ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం తమ భవిష్యత్తును నిర్ణయించుకొనే అవకాశం కశ్మీర్ ప్రజలకు వస్తుందని, ఆ రోజు వాళ్లంతా పాక్లో కలవడానికి ఇష్టపడతారని చెప్పారు.