Arvind Kejriwal | న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: తనను అవమానించడం, నిందించడమే తన అరెస్టు వెనుక ఉన్న ఏకైక లక్ష్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. తనను బలహీపర్చడమే లక్ష్యంగా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈడీ నోటీసులకు ఎలాంటి ప్రశ్నావళి లేకుండానే 7-8 సార్లు చాలా వివరంగా సమాధానాలు ఇచ్చానని, కాబట్టి అరెస్టు చేయాల్సిన అవసరమే లేదన్నారు. మద్యం పాలసీ కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల్లో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను బుధవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ విచారించారు.
కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ను ఎన్నికల ముందు అరెస్టు చేయడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత, పారదర్శకంగా ఎన్నికలు జరగడం కీలకమని, ఎన్నికల్లో అన్ని పక్షాలకు సమానావకాశాలు ఉండాలని పేర్కొన్నారు.
ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీని విచ్ఛిన్నం చేయడం, ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించడం కోసమే ఈ సమయంలో అరెస్టు చేయడానికి కారణమని ఆయన వాదించారు. ఏడాదిన్నర క్రితం విచారణ ప్రారంభించి సరిగ్గా ఎన్నికల ముందే అరెస్టు చేయడాన్ని ఆయన లేవనెత్తారు. ఈ కేసులో అప్రూవర్లుగా మారిన మాగుంట రాఘవ్, శరత్చంద్రారెడ్డి స్టేట్మెంట్లపై ఆధారపడొద్దని, వారు అధికార పార్టీకి(బీజేపీకి) ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
తీర్పు వాయిదా
సింఘ్వి వాదనలను ఈడీ తరపున విచారణకు హాజరైన అడిషినల్ సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వ్యతిరేకించారు. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా సాక్షుల స్టేట్మెంట్లు ఉన్నాయని పేర్కొన్నారు. నేరం చేస్తాం.. ఎన్నికలు ఉన్నందున అరెస్టు చేయొద్దు అని చెప్పే హక్కు ఎవరికీ లేదన్నారు. కాగా, ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.
కేజ్రీవాల్ 4.5 కిలోల బరువు తగ్గారు: ఆప్
మార్చి 21న అరెస్టు చేసిన నాటి నుంచి కేజ్రీవాల్ 4.5 కిలోలు బరువు తగ్గారని ఆప్ నాయకురాలు, ఢిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యాన్ని బీజేపీ ప్రమాదంలో పెడుతున్నదని ఆమె బుధవారం ఆరోపించారు. కేజ్రీవాల్ మధుమేహ బాధితుడని, ఆయన షుగర్ లెవల్స్ను రోజంతా పర్యవేక్షించాల్సి ఉంటుందని ఆమె తెలిపారు. ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు ఆయన షుగర్ లెవల్స్ మూడుసార్లు పడిపోయాయని పేర్కొన్నారు. జైలుకు వచ్చిన నాటి నుంచి కేజ్రీవాల్ బరువు తగ్గలేదని, వచ్చిన రోజు, ఇప్పుడు ఆయన 65 కిలోలే ఉన్నారని తీహార్ జైలు అధికారులు తెలిపారు.
జైలు తాళాలు బద్ధలై బయటకొస్తారు: సంజయ్ సింగ్
మద్యం పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బుధవారం తీహార్ జైలు నుంచి బయటకొచ్చారు. జైలు బయట పెద్ద ఎత్తున ఆప్ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అయితే, ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం కాదని, పోరాడాల్సిన సమయమని సంజయ్ సింగ్ పేర్కొన్నారు. తమ నాయకులను జైలులో పెట్టారని, జైలు తాళాలు బద్ధలై వారంతా బయటకొస్తారనే నమ్మకం తనుకుందన్నారు. రెండు కోట్ల ఢిల్లీ ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అనుకున్నందుకే కేజ్రీవాల్, సిసోడియా, సత్యేందర్ జైన్ను అరెస్టు చేశారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ బయపడబోదని అన్నారు. దేశంలో నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీకి సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. కేజ్రీవాల్ సతీమణి సునీతాతో ఆయన సమావేశమయ్యారు.