MS Swaminathan | పంటచేను వణికింది.. అన్నంగిన్నె తొణికింది. హరిత సూర్యుడు అస్తమించాడని మట్టిపువ్వు
బెంగటిల్లింది. భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. గురువారం చెన్నైలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.
ఆకలిచావులు చూస్తూ పెరిగిన స్వామినాథన్.. వ్యవసాయ పరిశోధనల వైపు దృష్టిసారించారు. సాగు బాగు కోసం సైన్సును మడిచేలకు మళ్లించి.. కరువు నేలలో సేద్యాన్ని సాధ్యం చేసి రైతు తలరాతలో నాలుగు మెతుకులు రాశారు. అధిక దిగుబడి విధానాల కోసం తపించి, యాంత్రీకరణతో సాగుభారాన్ని తప్పించారు. పంజాబ్ను గోధుమచేనుగా మార్చారు. సాగురంగంలో తెలంగాణ ఎదుగుదలను చూసి మురిసిన స్వామినాథన్.. రాష్ర్టాన్ని సందర్శిస్తానని ఇటీవలే ప్రకటించారు. అంతలోనే దివికి తరలివెళ్లారు.
చెన్నై, సెప్టెంబర్ 28: భారత వ్యవసాయరంగానికి కొత్త దారులు చూపి ‘హరిత విప్లవ పితామహుడిగా’ కీర్తి గడించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ (98) అస్తమించారు. చెన్నైలోని స్వగృహంలో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. డబ్ల్యూహెచ్వో మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్ ఈయన కూతురే. స్వామినాథన్ పరిశోధనలు భారత వ్యవసాయ రంగంలో పెను విప్లవాన్ని తీసుకొచ్చాయి. స్వామినాథన్ సృష్టించిన కొత్త వంగడాలు మూలంగా దేశంలో గోధుమ, వరి పంటల్లో దిగుబడి అమాంతం పెరిగింది. కోట్లమంది రైతులు పేదరికం నుంచి బయటపడ్డారు. స్వామినాథన్ పరిశోధనలు రైతాంగానికి కొత్త ఆదాయ మార్గాలను చూపించాయి.
స్వామినాథన్ పరిశోధనలు దేశంలో ప్రజల ఆకలి, పౌష్టికాహార లోపంపై ప్రభుత్వం యుద్ధం చేసేందుకు ఇతోధికంగా తోడ్పడ్డాయి. 1960 దశకంలో స్వామినాథన్ హైబ్రిడ్ వంగడాలను సృష్టించారు. వీటి ఆధారంగా మొదట పంజాబ్లో ఆధునిక వ్యవసాయం మొదలుపెట్టారు. స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివ ఒక సర్జన్, తల్లి పార్వతి తంగమ్మాళ్ గృహిణి. కోయంబత్తూరు (ప్రస్తుతం తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం) వ్యవసాయ కళాశాలలో ఆయన గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడిగా పేరు గడించిన నార్మన్ ఈ బోర్లాగ్తో కలిసి కొత్త వంగడాలపై పరిశోధనలు నిర్వహించారు. ముఖ్యంగా గోధుమ పంటలో హైబ్రిడ్ వంగడాలను ఆవిష్కరించారు. అవి భారతీయ వ్యవసాయ ముఖచిత్రాన్నే మార్చేశాయి.