వివాదాల పరిష్కారానికి అదే ఉత్తమ మార్గం
మరిన్ని ఆర్బిట్రేషన్ కోర్టుల ఏర్పాటు అవసరం
మధ్యవర్తిత్వ సదస్సులో సీజేఐ జస్టిస్ రమణ
న్యూఢిల్లీ, జూలై 5: వాణిజ్య ప్రపంచానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ వివాద పరిష్కార మార్గమని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. మధ్యవర్తిత్వ కేసుల విచారణకు మరిన్ని కోర్టులు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని, ఈ రంగంలోని నిపుణులను ఈ కోర్టులకు న్యాయమూర్తులుగా నియమించాలని సూచించారు. లండన్లో మంగళవారం నిర్వహించిన ‘ఆర్బిట్రేటింగ్ ఇండో-యూకే కమర్షియల్ డిప్యూట్స్’ సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు. మధ్యవర్తిత్వానికి భారత న్యాయస్థానాలు సానుకూలమని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితులు, డిమాండ్లకు అనుగుణంగా భారత్లో మధ్యవర్తిత్వ వ్యవస్థ పురోగమిస్తున్నదని పేర్కొన్నారు.
ఆర్బిట్రేషన్ విధానాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ‘సాయానికి, జోక్యానికి మధ్య ఉన్న సన్నని రేఖను మనం దాటకూడదని’ సూచించారు. రెగ్యులర్ కోర్టులు తీర్పు వెల్లడించడంలో చాలా సమయం తీసుకుంటుండటం ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలపై ప్రభావం చూపుతున్నదని చెప్పారు. భారత్లో పెండింగ్ కేసులు పెను సమస్యగా మారిన విషయాన్ని తిరస్కరించలేమన్నారు. మౌలిక వసతులు లేకపోవడం, తగినంత సంఖ్యలో న్యాయమూర్తులు లేకపోవడం వల్ల పనిభారం పెరుగుతున్నదని చెప్పారు. అందుకే న్యాయస్థానాలను అప్గ్రేడ్ చేయాలని, జడ్జిల నియామకాలు వేగవంతం చేయాలని తాను గట్టిగా కోరుతున్నానన్నారు. తాను సీజేఐగా బాధ్యతలు చేపట్టాక సుప్రీంకోర్టులో 11 ఖాళీలను భర్తీ చేయడంతో పాటు వివిధ హైకోర్టుల్లో 163 మంది జడ్జిలను నియమించినట్టు వెల్లడించారు. మరో 23 పేర్లు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. నియామకాలను వేగవంతం చేయాలని తాను ఇప్పటికే కేంద్రాన్ని కోరానని చెప్పారు.