సామాజిక న్యాయసాధనలో కీలకం: జస్టిస్ రమణ
కేవడియా, ఏప్రిల్ 9: వివాదాల పరిష్కారానికి న్యాయవ్యవస్థతో పాటు లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్ సెంటర్ల లాంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు చాలా కీలకమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. న్యాయాన్ని వేగంగా అందించడంలో, కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడంలో, దేశ ప్రజలకు సామాజిక న్యాయాన్ని అందించడంలో ఇవి ఎంతో దోహదం చేస్తాయన్నారు. గుజరాత్లోని కేవడియాలో శనివారం ఓ కాన్ఫరెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. న్యాయవ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సత్తా ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థలకు ఉందని వ్యాఖ్యానించారు. మధ్యవర్తిత్వానికి కోర్టులు కూడా సహకరించాలని సూచించారు. న్యాయవ్యవస్థ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.