Rajnath Singh | త్రివిధ బలగాలను మరింత పటిష్ట పరిచేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. రూ.45 వేల కోట్ల వ్యయంతో అత్యాధునిక ఆయుధ సంపత్తి సమకూర్చాలని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డిఫెన్స్ అక్వైజిషన్ కౌన్సిల్ (డీఏసీ) నిర్ణయించింది. సైనిక బలగాలకు 12 సుఖోయ్ విమానాలు, ధృవాస్త్ర క్షిపణులతోపాటు ఆయుధ వ్యవస్థను సమకూర్చడానికి డీఏసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
`ఆత్మ నిర్భర్ భారత్` విధానంలో భాగంగా దేశీయ సంస్థల నుంచే వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు రక్షణ శాఖ తెలిపింది. రక్షణ శాఖ ఉత్పత్తుల్లో దేశీయ సామాగ్రి వాడకం 50 నుంచి 60-65 శాతానికి పెంచాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశీయంగా తయారైన ఉత్పత్తుల వాడకానికి ప్రాధాన్యం ఇవ్వాలని త్రివిధ దళాధిపతులను కోరారు.
ఆర్మీ అవసరాలకు లైట్ ఆర్మ్డ్ మల్టీ పర్పస్ వెహికల్స్, ఇంటిగ్రేటెడ్ సర్వైలెన్స్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్, హై మొబిలిటీ వెహికల్, గన్ టోయింగ్ వాహనాలు.. నావికా దళం కోసం అత్యాధునిక సర్వే నౌకలను కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనను డీఏసీ ఆమోదించింది. ఇక డోర్నియర్ ఎయిర్ క్రాఫ్ట్లను మరింత మెరుగు పర్చాలన్న వాయుసేన ప్రతిపాదనలకు అనుమతి ఇచ్చింది.