న్యూఢిల్లీ, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన త్వరలో జరుగనున్నది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సమావేశాలు జరిగినా తెలంగాణ ప్రతిపాదనలను ఏపీ తిరస్కరించడంతో సమస్య పరిష్కారం కాలేదు. ఏపీ భవన్ సముదాయంలోని భవనాలను రెండు రాష్ర్టాలు ఉపయోగించుకొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ భవన్ విభజనపై ఢిల్లీలో ని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించారు.
కేంద్ర, రాష్ట్ర సంబంధాల సంయుక్త కార్యదర్శి సంజీవ్కుమార్ జిందాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు అరగంటపాటు కొనసాగింది. తెలంగాణ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్.. ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, ఏపీ రీఆర్గనైజేషన్ సెక్రటరీ ప్రేమ్చంద్రారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్దాస్, ఏఆర్సీ హిమన్షు కౌశిక్ హాజరయ్యారు. ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ రానున్న వారం రోజుల్లో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్టు సమాచారం.