Loksabha elections 2024 : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొడిగింపు కోరుతూ సర్వోన్నత న్యాయస్దానాన్ని ఆశ్రయించడంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్లో మంత్రి విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారానికి సంబంధించి కేజ్రీవాల్ ముసుగు తొలగిందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. 47 డిగ్రీల సెల్సియస్లో కేజ్రీవాల్ రోడ్షోల్లో పాల్గొంటున్నారని, కానీ అదే సమయంలో అనారోగ్యం పేరుతో బెయిల్ పొడిగింపును కోరుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ మోదీ ఫోబియాతో బాధపడుతున్నదని ప్రియాంక గాంధీ ప్రకటనను ఉద్దేశించి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పేదరిక నిర్మూలనకు కృషిచేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ 60 ఏండ్ల పాటు ప్రజలను మోసగించిందని దుయ్యబట్టారు. అమేథి, రాయ్బరేలిలో గతంలో మరుగుదొడ్లు ఉండేవి కాదని, మురికి వాడలు ఉండేవని ఆయన గుర్తుచేశారు.
మోదీ 25 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేశారని పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు భారీ షాక్ తగిలింది. తనకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజులు పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో (Supreme Court) కేజ్రీవాల్ పిటిషన్ వేసిన (bail extension plea) విషయం తెలిసిందే.
అయితే కేజ్రీవాల్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టబోమని బుధవారం స్పష్టం చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్కు ఇదివరకే అవకాశం ఇచ్చినందున ఈ పిటిషన్ను విచారించడం సాధ్యం కాదని కోర్టు రిజిస్ట్రీ తెలిపింది.
Read More :
Bengaluru Rave Party | బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. హేమకు మరోసారి నోటీసులు