సిమ్లా : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆప్ పావులు కదుపుతున్న నేపధ్యంలో ఆ పార్టీకి హిమాచల్ ప్రదేశ్లో ఏ మాత్రం పట్టు లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. హిమాచల్లో సత్తా చాటేందుకు ఆప్ నేతలు తరచూ రాష్ట్రంలో పర్యటిస్తున్న క్రమంలో ఆప్నకు ఇక్కడ ఏమాత్రం ఉనికి లేదని, ఆప్ రాష్ట్ర శాఖ దుకాణం మూతపడిందని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు.
మరోవైపు పార్టీ రాష్ట్ర శాఖ అగ్రనేతలు పలువురు కాషాయ పార్టీ గూటికి చేరడంతో ఆప్ సోమవారం హిమాచల్ ప్రదేశ్ వర్కింగ్ కమిటీని రద్దు చేసింది. ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో పార్టీ నూతన కమిటీని త్వరలో పునర్వ్యవస్ధీకరిస్తామని ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ ప్రకటించారు.
కాగా గత శుక్రవారం ఆప్ హిమాచల్ ప్రదేశ్ అధ్యక్షుడు అనూప్ కేసరి, ప్రధాన కార్యదర్శి సతీష్ ఠాకూర్, ఉనా జిల్లా చీఫ్ ఇక్బాల్ సింగ్ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సమక్షంలో కాషాయ పార్టీలో చేరారు. ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి తలపడనుండటంతో పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం నేపధ్యంలో హిమాచల్లోనూ సత్తా చాటాలని ఆప్ ఉవ్విళ్లూరుతోంది.