కోటా(రాజస్థాన్), జనవరి 29: రాజస్థాన్లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలకు తెరపడడం లేదు. జేఈఈకి శిక్షణ పొందుతున్న ఎంతోమంది విద్యార్థులు ఆత్మహత్యలతో అర్ధంతరంగా ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా, మరో విద్యార్థి నిహారికా సింగ్ (18) తన ఇంట్లోనే సోమవారం ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. అంతకుముందు తన తల్లిదండ్రులను ఉద్దేశించి సూసైడ్ నోట్ రాస్తూ ‘అమ్మా, నాన్నా జేఈఈ నా వల్ల కాదు. నేను ఓడిపోయాను. నేనో చెత్త కుమార్తెను.
అమ్మా నాన్న నన్ను క్షమించండి. నాకున్న చివరి ఆప్షన్ ఇదే. నేను ఆత్మహత్య చేసుకుంటున్నా’ అని రాసుకొచ్చింది. ఆమె ఆత్మహత్యకు ఒత్తిడే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించిన రోజే నిహారిక ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం. కోటాలో నిరుడు 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోగా, ఈ ఏడాది ఇది రెండోది.